అమ్మ చెప్పిన చిన్ని కథలు
అందరికి మొదటి గురువు అమ్మే. ఇది అందరికి విదితమైన విషయమే.
మనకు చిన్నప్పుడు కథలు వినాలంటే ముందు అమ్మ దగ్గరకే వెళ్లి విసిగిస్తాం.
ఈ టపా రాసే ముందు చిన్నప్పుడు నేను అమ్మ దగ్గర ఏ ఏ కథలు చెప్పించుకొని విన్నానా
అని ఒక సారి అలోచించి చూస్తే చాల కథలే గుర్తుకు వచ్చాయి.
మా అమ్మ పెద్దగా చదువుకోలేదు
కానీ కథలు చెప్పడం లో ఘనాపాటి.
ఎన్నెన్ని కథలు చెప్పేది. అందులో చాలా మటుకు జానపద కథలే
ముఖ్యంగా సంతోషిమాత వ్రత కథ నుంచి మొదలు పెడితే
బాలనాగమ్మ కథ, సన్యాసమ్మ కథ, కావమ్మ కథ, కాంభోజ రాజు కథ,
భట్టి విక్రమార్కుని కథ, బొబ్బిలి యుద్ధం మొదలైన కథల నుండి
మర్యాదరామన్న కథలు, తెనాలి రామకృష్ణుని కథల వరకు
ఎన్నెన్నో కథలు చెప్పేది.
వీటిల్లో చాలా కథలను తరువాత టి.వి. లో సినిమాల రూపం లో చూసినప్పుడు
అమ్మ చెప్పిన కథలతో వాటిని పోల్చి ఆశ్చర్యపోయేవాళ్ళం.
ఈ జానపద సాహిత్యమంతా మా అమ్మ కు కొట్టిన పిండి.
ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపుడు పిల్లలను అమితంగా ఆకర్షించేవి ఈ జానపద కథలే
ముఖ్యంగా మా అమ్మ పంచతంత్ర కథలను ఎంత బాగా వర్ణించి చెప్పేదంటే
ఆ జంతువుల, పక్షుల పాత్రలు నిజంగా మాట్లాడుతాయా అన్నంత కుతూహలంగా కథను వినేవాళ్ళం.
నిజం చెప్పాలంటే అమ్మ చెప్పిన చిన్ని కతలు ఇప్పటికి నాకు మరపురాని జ్ఞాపకాలే.
అందరికీ ఆదిగురువు అమ్మే కదండీ !మీ అమ్మ గారి। మీద మీకున్న ప్రేమకు అభినందనలు .